దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. వ్యూహాలు, ఎత్తుగడలు మొదలయ్యాయి. 2014 నాటి రిజల్ట్ మళ్లీ రిపీటవుతుందా? రాహుల టీం ఆశలు నెరవేరుతాయా? కొత్తగా నమోదైన 8.4 కోట్ల ఓట్లు ఎటువైపు? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? పొత్తుల్లో కొత్త ట్రెండ్స్ వర్కవుట్ అవుతాయా?
మోదీనే హాట్ ఫేవరేట్
ఎన్నికల రణం ఉత్కంఠ మొదలైంది. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు సర్వం సిద్ధమైంది. మళ్లీ పవర్ దక్కించుకునేందుకు ప్రధాని మోదీ డైరెక్షన్లో ఎన్డీయే వ్యూహాలు రచిస్తోంది. మోదీని ఎలాగైనా ఎదుర్కొవాలని విపక్షాలు తమ ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ ఐదేళ్లలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి. అప్పట్లో మోదీ ఒక ప్రభంజనం. పైగా కాంగ్రెస్ మీద వ్యతిరకేత బాగా కలిసొచ్చింది. యూపీఏకి ఊహించని పరాభవం ఎదురైంది. ఎన్డీఏ సూపర్ హిట్ అయింది. దేశానికి తాను కాపలాదారునని మోదీ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని ప్రజల మన్ననలు పొందాయి, కొన్ని వ్యతిరేకతలూ ఉన్నాయి. ఇప్పుడు మోదీ సూపర్ హీరోనే అంటున్నాయి.సర్వేలు. సర్వేల్లో నిజానిజాలు ఎలా ఉన్నా… దేశం మళ్లీ మోదీనే కోరుకుంటోందన్నది నిజం. ప్రజలు మోడీ మోడ్రన్ పరిపాలనను అంగీకరించారు. కొత్త తరహా నాయకత్వాన్ని చూశారు. డీమానిటైజేషన్తో ఇబ్బందులు పడినా ప్రజలు సహించారు. బ్లాక్ మనీ మీద ఫైట్కి మోదీకి కావల్సినంత సపోర్ట్ ఇచ్చారు. జీఎస్టీ విషయానికి వస్తే సపోర్ట్ అంతా ఉందని చెప్పలేం. ఈ ఐదేళ్లలో మోదీ ప్రభుత్వానికీ ఎత్తుపల్లాలు తప్పలేదు. చివరి దశలో రఫేల్ యుద్ధ విమానాల విషయంలో రాహుల్ గోల గోల చేసినా… అందులో అవినీతేం జరగలేదన్న సుప్రీం, కాగ్ నివేదికలు మోదీకి ప్లస్. దృఢ నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఉగ్రవాదంపై మోదీ చేసిన పోరు యువతను బాగా ఆకర్షించింది. ముఖ్యంగా పాకిస్థాన్కి కౌంటరిచ్చిన సర్జికల్ స్ట్రైక్స్కి దేశ యువత ఫిదా అయిపోయారు. మోదీ కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగారన్న ఒపీనియన్ వచ్చింది. ఇలాంటి విషయాల్లో యూత్ ఓట్ ఈ సారి మోదీ వైపే. అప్పట్లో హిందీ రాష్ట్రాలు మోదీని నెత్తిన పెట్టుకున్నాయి. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రాలనే మోదీ నమ్ముకున్నారు. దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న సౌత్లో బిజేపీ హవా అంతంత మాత్రమే. కానీ ఎన్నికల తర్వాత పొత్తుల్లో సంచలనాలు నమోదవ్వచ్చు.
ప్రాంతీయ పార్టీల జోష్
ఈ సారి ప్రాంతీయ పార్టీల పట్టు గట్టిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ మాంచి దూకుడు మీద ఉన్నాయి. కొత్త పార్టీ జనసేన హాట్ ఫేవరేట్గా బరిలో దిగుతోంది. ఇక తెలంగాణలో గులాబి తప్ప మరో రంగు కనిపించే అవకాశాలే కన్పించడం లేదు. ఇక బెంగాల్ మమతా దీదీ తృణమూల్ కాంగ్రెస్ పట్టు మీదే ఉన్నా… ఈ మధ్య శారదా ఛిట్ఫండ్ కుంభకోణం విషయంలో జరిగిన పరిణామాలు మమతాకి పూర్తిగా వ్యతిరేకంగా మారుతున్నాయి. అక్కడ బీజేపీ పట్టు బిగిస్తోందనే చెప్పాలి. ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ–బీఎస్పీ జోడి… మైనారిటీ, ఎస్సీ ఓట్బ్యాంకు స్ర్రాటజీ గట్టిగానే ఉంది. అక్కడ ప్రియాంక పడవ ప్రయాణ ప్రచారం వ్యూహాత్మకంగా సాగుతోంది. నెహ్రూ జమానా నుంచి వస్తున్న అగ్రవర్ణ ఓటు బ్యాంకుపై మళ్లీ పట్టు కోసం కాంగ్రెస్ ఎత్తులు ఏమవుతాయో చూడాలి. కానీ, ఎన్ని ఎత్తులు వేసినా… వారణాసి నుంచి మోదీ పోటీ చేయడం… ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతా ప్రభావం చూపిస్తుంది. నిజానికి ఎన్ని సమీకరణాలు మారినా.. యూపీలో బీజేపీ ఓటు బ్యాంకు సేఫ్గానే ఉంది.
ఇగోలు పక్కన పెట్టి పొత్తులు
మహారాష్ట్రలో ఈ సారి రాజకీయాలు మంచి హీటు మీద ఉన్నాయి. కీచులాటల మధ్యే కాంగ్రెస్–ఎన్సీపీ పొత్తు కుదిరింది. పొత్తుల విషయంలో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఇగోలు పక్కన పెట్టాయి. ఎప్పుడూ అలకల మీదుంటే శివసేనని బుజ్జగించి మళ్లీ ఎన్డీఏ గూటికి చేర్చుకుంది బీజేపి. అసోంలో కాదని వెళ్లిపోయిన ఏజీపీని కూడా బీజేపీ దగ్గర తీసింది, ఆప్నాదళ్ లాంటి చిన్న పార్టీల డిమాండ్లను కూడా పరిగణనలో కి తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఈసారి ఇగోలు పక్కన పెట్టింది. బిహార్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇష్యూలు లేకుండా మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్తో కలిసే అవకాశాలే ఉన్నాయి. రుసరుసలాడే ఆమ్ఆద్మీతో కూడా కలిసి వెళ్తేందుకు కాంగ్రెస్ రెడీ అంటోంది.
బీజేపీ బ్రాండ్… మోదీ
ఈ సారి కూడా ఎన్డీఏకి బ్రాండ్ మోదీ. ఆయన చూపిన కొత్త తరహా నాయకత్వం ప్రజలకు నచ్చింది. అభివృద్ధి హామీలు గుప్పించడం కాకుండా చాలా చేసి చూపించారు మోదీ. 2014 టైంకి యూపీఏ నిండా కుంభకోణాల కంపు. కానీ ఈ ఐదేళ్లలో కుంభకోణాలు వినిపించలేదు. ఇక దేశమంతా బిజేపీకి బలమైన క్యాడర్ ఉంది, ఆర్ఎస్ఎస్ అండ ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాదులపై చేసిన మెరుపు దాడులు… దేశ భక్తిని దేశమంతా నింపాయి. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు తారక మంత్రమే. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం, మధ్య తరగతిని ఆకట్టుకున్న బడ్జెట్లు మిడిల్ క్లాస్ ఓట్ని మోదీ వైపు చూపిస్తున్నాయి.
కాంగ్రెస్…నో కాన్ఫిడెన్స్
ఇక కాంగ్రెస్కి వస్తే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించినా.. ఆ తర్వాత కాంగ్రెస్ జోరు కొనసాగలేదు. ఉత్తర ప్రదేశ్లో రాజకీయం పనిచేస్తుందని ఆశమీద ఉంది. అలాగే ప్రియాంక రాక మేజర్ టర్న్ అవుతుందని కూడా ఆశిస్తోంది. ఎన్ని జరిగినా.. అధికార దండం కాంగ్రెస్ చేతికొస్తుందా లేదా అన్న కాన్ఫిడెన్స్… కాంగ్రెస్లో ఇప్పటికీ కనిపించడం లేదు. రాహుల్లో ఇప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు. కర్ణాటక, కేరళ, పంజాబ్, అసోంలో కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నా… ప్రభుత్వాలు నిర్మించేంత కెపాసిటీ ఉందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. పైగా ప్రజలకు ఖచ్చితమైన నమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ విఫలమైంది. మోదీ అంత స్ట్రాంగ్ లీడర్ షిప్ క్వాలిటీస్ కాంగ్రెస్లో ఏ లీడర్లోనూ కనిపించడం లేదన్నది వాస్తవం. ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే… ఈ సారి బలమైన పోరులో కాంగ్రెస్ ఆటలో అరటిపండులాగే కనిపిస్తోంది. తెలంగాణలో ఆల్రెడి గాంధీ భవన్ ఖాళీ అవుతోంది. కర్ణాటకలో కూటముల మధ్య కాంగ్రెస్ ఊగిసలాడుతోంది. ఇక కేరళ, పంజాబ్లో పుంజుకుంటేనే కాంగ్రెస్ హవా కనిపిస్తుంది.
కింగ్ ఎవరు?
ఇన్ని రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడల మధ్య సామాన్యుడి ఓటు అస్త్రం ఎటు వైపు. మారుతున్న దేశ పరిణామాలు, పెరుగుతున్న జీవన ప్రమాణాలతో పాటు ఇంకా దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు ప్రజలను విసిగిస్తున్నాయి. వాటితో పాటు ప్రజల ఆలోచన ధోరణి కూడా పరిణితి చెందింది. ఈ సారి దేశ వ్యాప్తంగా దాదాపు 8 కోట్ల 50 లక్షల కోత్త ఓట్లు నమోదయ్యాయి. వీటిసో మాక్సిమన్ ఓట్ యువతదే. ఉరకలేసే ఉత్సాహంతో, సరికొత్త ఆలోచనతో వారు వేసే ఓటే ఇప్పుడు అత్యంత కీలకం. ఇన్ని సమీకరణాల మధ్య కింగ్ ఎవరు? జడ్డిమెంట్ డే వరకు ఆగాల్సిందే.