మానవ వికాసానికి ఉపయోగపడాల్సి విజ్ఞానం… ఒక భూతంలా లక్షల మంది ప్రాణాలు తీసిన రోజు. సైన్స్ అంటే ప్రగతి మాత్రమే కాదు.. అంతకు మించి వినాశనం అని ఋుజువు చేసిన రోజు. ఈ రోజు. 1945 ఆగస్ట్ 6. చాలా మందికి ఈ డేట్ చెప్తే గుర్తుండకపోవచ్చు. బట్… హిరోషిమా నగరంపై అమెరికా చేసిన అణుదాడి అంటే ఆ భయానక ఘటన ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈ మానవ కల్పిత వినాశనం జరిగి 73 ఏళ్లు. ప్రపంచంలోనే తొలి అణుబాంబు దాడి ఇది.
అణుబాంబు ధాటికి సుమారు 5 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సర్వ నాశనమైంది. అక్కడికక్కడే 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 35 వేల మంది అవయవాలు కోల్పోయి జీవితాంతం ఛస్తూ బతికారు. అణుబాంబు దాడిలో చనిపోతేనే సుఖం. బతికున్నామా.. నిత్య నరకం. న్యూక్లియర్ రేడియేషన్ మనిషిని క్షణం క్షణం చంపుతూ ఉంటుంది. అదో పవర్ఫుల్ స్లో పాయిజన్. హిరోషిమాలో ఇప్పటికీ ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. రేడియేషన్ ప్రభావంతో బాంబు దాడి జరిగిన ఏడాది లోపు మరో 60 వేల మంది చనిపోయారు. ఈ దారుణం జరిగిన 3 రోజులకు నాగసాకి నగరంపై మరో అణుదాడి చేసింది అమెరికా. ఈ దారుణాల తర్వాతే జపాన్ లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ పాశవిక చర్య, దాని ఘోర ఫలితాలు చూసిన తర్వాతే అణ్వాయుధాల నిరోధాలు, నిషేధాలు అంటూ ప్రపంచం కదిలింది. ఈ బాంబు దాడి వెనుక ఎన్నో విషాదాలు, ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు.
హిరోషిమా అంటే విశాలమైన దీవి అని అర్థం. జపాన్లో అతిపెద్ద నగరాల్లో హిరోషిమా ఒకటి. 1945 ఇవాళ్టి రోజు.. పొద్దున్నే 8.15కి ఎవరి హడావిడిలో వాళ్లు ఉన్న సమయంలో… అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కేవలం ముగ్గురు సైనికులతో కూడిన విమానం ద్వారా అణుబాంబు జారవిడిచింది. 9వేల పౌండ్ల బరువు, 10 అడుగుల పొడవు ఉన్న యురేనియం అణు బాంబుకి అమెరికా పెట్టుకున్న కోడ్ లిటిల్ బాయ్. ఆనాటికి 3.4 లక్షల జనాభా ఉన్న హిరోషిమా జనాభా… బాంబు దాడి తర్వాత 1.37లక్షలకు పడిపోయింది.
ఇంత పెద్ద అణుదాడిని కూడా తట్టుకుని.. ఆ తర్వాత హిరోషిమాలో పూసిన తొలి పుష్పం ఓలియెండర్. అందుకే శాంతికి చిహ్నంగా ఆ పుష్పాన్ని హిరోషిమా నగర అధికారిక పుష్పంగా ప్రకటించారు. అంత బాంబు దాడిలోనూ.. హిరోషిమాలో ట్రాములు నడిచాయి. సహాయక చర్యలు అందించాయి. వాటిలో చాలా ఇప్పటికీ పనిచేస్తున్నాయట.
హిరోషిమా మొత్తంలో అణుదాడిని తట్టుకుని యురేనియంకి కూడా సవాల్ విసిరినవేంటో తెలుసా… గింక్గో చెట్లు. బాబు దాడి జరిగిన నెలరోజులకే మళ్లీ చిగురించి… ఎన్ని దాడులు ఎదురైనా జపాన్ కూడా ఇలాగే వికసిస్తుందని అమెరికాకు చాటిచెప్పాయి. అది నిజమే అయింది.. అలాంటి విధ్వంసక దాడి తర్వాత.. శరవేగంగా అభివృద్ధి చెంది… అగ్రదేశాలు నివ్వెరపోయే అభివృద్ధి సాధించింది జపాన్. హిరోషిమా మెమోరియల్ పార్క్లో 1964లో శాంతి జ్యోతిని వెలిగించారు. అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించే వరకు ఆ జ్యోతి నిరంతంరం వెలుగుతూనే ఉంటుంది.
1 Comment
అయితే… ఆ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.
ఆరిందా….
ప్రపంచం వినాశనమైనట్లు భావించాలి…