ఎన్ని విమర్శలొచ్చినా, భిన్నాభిప్రాయాలున్నా… పెద్ద నోట్ల రద్దు, ఇతర చర్యలతో నల్ల కుబేరులను మోడీ భయపెట్టారన్నది వాస్తవం. ఈ మధ్య వచ్చిన కొన్ని లెక్కల ప్రకారం 2016,17ల్లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు భారీగా పెరిగిందని గోల గోల అయింది. కానీ, ఇందులో తప్పులున్నాయంటోంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ఆ దేశంతో మనకున్న ఒప్పందం ప్రకారం… 2018 నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. 2019 సెప్టెంబరు నుంచి ఏటేటా డిపాజిట్ల సంబంధించి డేటా ఇస్తారు. వాటి ప్రకారం స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ డిపాజిట్స్ ఈ నాలుగేళ్లలో ఏకంగా 80 శాతం తగ్గాయట. స్విస్ రాయబారి ఆండ్రియాస్ బౌమ్ దేశ ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్కు లేఖ రాశారు. భారతీయులు చేసిన ప్రతీ డిపాజిట్ను నల్లధనంగా చిత్రీకరిస్తున్నారని అందులో సారాంశం. స్విట్జర్లాండ్ ఇచ్చిన లెక్కల ప్రకారం… 2016-17 లో డిపాజిట్లు 34.5% తగ్గాయి. 2016లో భారతీయులు స్విస్ డిపాజిట్లు 800 మిలియన్ డాలర్లు. 2017 నాటికి ఈ విలువ 524 మిలియన్ డాలర్లకు తగ్గింది. 2013లో అయితే స్విస్ బ్యాంకుల్లో ఇండియన్స్ డిపాజిట్లు ఏకంగా 2648 మిలియన్ డాలర్లు. ఈ లెక్కన గత నాలుగేళ్లలో స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు 80% తగ్గాయి. బ్యాంకింగ్ లావాదేవీల గోప్యతే ప్రధానంగా నడిచే స్విస్ బ్యాంకులు ఇచ్చిన సమాచారమే ఇది. ఆధార్ అనుసంధానం, ఆర్థికపరమైన నిఘా, ఆర్థిక నేరాలు వరుసగా బయట పడడం.. ఇలాంటి కారణాల వల్ల స్విస్లో రెగ్యులర్గా డిపాజిట్ చేసే నల్ల కుబేరులు భయపడి ఉండవచ్చు. ఒక్కసారిగా ఆగిన ఆ డిపాజిట్లలో అంతా నల్లధనం కాకపోవచ్చు. కానీ, ఎక్కువ భాగం నల్లధనమే. మరి, ఆ డబ్బు ఏ నల్ల మాళిగల్లో ఉన్నట్టు…?