నిజమే.. హోదా ఇస్తామన్నారు… మాట తప్పారు. ఆంధ్రకు తీరని అన్యాయం జరిగింది. పోరాడాల్సిందే. హోదా వచ్చేవరకు ఉద్యమించాల్సిందే. కానీ, అవిశ్వాసం పెడితే ప్రత్యేక హోదా వస్తుందని ఎవరు చెప్పారు ? సమస్యల వాయిస్ వినిపించడానికి అవిశ్వాసమే మందు అని ఎవరు చెప్పారు? అలా చేస్తే జాతీయ స్థాయిలో హోదా సమస్య తెలుస్తుందన్న అతి విశ్వాసం ఎవరు కల్పించారు? ఓడిపోతాం.. అని తెలిసి ఆటలో దిగడం ఎంత వరకు కరెక్ట్? అందులోనూ అవిశ్వాసం లాంటి పెద్ద నిర్ణయానికి ఓ స్టేటస్ ఉండాలి. కనీసం ఓడినా గెలిచినట్టుండాలి. మొరాలిటీకి మెజారిటీకి మధ్య జరిగిన యుద్ధం అని ఎంత చెప్పినా… ఈ అవిశ్వాసం వల్ల నూటికి నూరు శాతం ప్రయోజనం బీజేపీకే దక్కింది. అవిశ్వాసం… అవిశ్వాసం అని జాతీయ స్థాయిలో ఏకరువు పెట్టి కేవలం 126 ఓట్లతో మోడీ వ్యతిరేక కూటమి అతి బలహీనమని దేశానికి తెలిసింది. తమది సూపర్ పవర్ అని ఎన్నికల ముందే మరో సారి బీజేపీ ఋజువు చేసుకుంది. కాదు.. అవిశ్వాసం సాక్షిగా బలం తెలిసింది. పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? జగన్ ఎక్కడ? అని ముఖ్యమంత్రి నిలదీశారు. వాళ్లు వచ్చి మాత్రం ఏం చేస్తారు…? జగన్కి కేసుల భయం.. అందుకే ఆయన చేస్తానంటున్న బంద్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కాదు… చంద్రబాబుకి వ్యతిరేకంగా. ఇక పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు. ఇదొక విఫల యత్నమని అందరికీ తెలుసు. హోదా కావాలంటే ఏం చెయ్యాలో..? ఏం చేస్తే హోదా వస్తుందో.. సరైన మార్గ నిర్దేశం లేదు.. ఇది నిజం. లేదా… “చూశారా మేం హోదా కోసం కేంద్రంతో కూడా ఫైట్ చేశాం” అని ప్రజలను నమ్మించడానికా? ఈ సమస్యని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లి మోడీ దుమ్ము దులిపేద్దాం అనుకుంటే ఒరిగేది ఏమీ లేదని తెలిసిపోయింది. పోనీ మోడీ ఏమైనా కొత్త విషయాలు చెప్పారా? అదే పాత కథ… “14 వ ఆర్థిక సంఘం…హోదా ఇవ్వలేం.” గల్లా జయదేవ్ బాగా మాట్లాడారు.. నో డౌట్. ఎప్పట్లాగే రామ్మోహన్ నాయుడు వెరీ గుడ్. పిల్ల చేష్టలు చేసినా… రాహుల్ కూడా ఈ సారి ఫర్వాలేదు. కేశినేని మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ, వీళ్లందరి కంటే మోడీ మహా ముదురు. కన్విన్సింగ్గా ఎలా మాట్లాడాలి అన్న విషయంలో పీహెచ్డీ చేశారు. అందుకే… ప్యాకేజీకి సమానమైన హోదా ఇస్తామంటే నమ్మి ఓకే అన్నామని గల్లా జయదేవ్ ఎంత వాగ్ధాటి ప్రదర్శించినా… ఉపయోగం లేకపోయింది. గతంలో ప్యాకేజీ అంటే ఓకే అనడం అబద్ధం కాదు. హోదా వేరు, ప్యాకేజీ వేరు.. హోదాకు సమానమైన ప్యాకేజీ అంటే అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎలా సమానమనుకున్నారు..? హోదా హోదానే, ప్యాకేజీ ప్యాకేజీనే.. అవి ఎప్పటికీ సమానం కావు అని తెలుసుకోలేకపోయారా? ప్యాకేజీ అనగానే.. ఓకే.. అనేయడం తప్పులో కాలేయడం కాదా? లేక ప్యాకేజీ మంత్రం వెనుక వేరే తంత్రముందా? అందుకేనా… కేంద్రం అదే పట్టుకు కూర్చుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజల్లో హోదాకి, ప్యాకేజీకి మధ్య తేడా తెలిశాక, హోదా ఉద్యమం మొదలయ్యాక, అప్పటి నుంచి కదా తెలుగు దేశం పార్టీ హోదా పాట పాడుతోంది. హోదా కోసం చేసిన పోరాటంలో చంద్రన్న ఏం చేయగలిగారు? ఎప్పుడూ ఒకటే మాట. కేంద్రంపై అవే ఆరోపణలు.. “తలుపులు మూశారు.. విభజించారు.. ఏపీ కష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వమే.. మోడీ మోసం చేశారు..” ఇవి తప్ప టెక్నికల్గా ముందుకెళ్లింది లేదు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని చెప్పలేదని గల్లా వివరించారు. ఇది టెక్నికల్ అంశమేగా? మరి ఆ విషయాలేంటో ప్రజలకు తెలిసేలా చెప్తే… హోదా ఉద్యమానికి మరింత బలం వస్తుంది. ఇలాంటివి ఎందుకు చేయలేదు..? ఉద్యమాన్ని కొనసాగిస్తే… ఫలితం ఎలా ఉన్నా… ప్రజల్లో ఓ నమ్మకం ఉంటుంది. ఇప్పుడీ అవిశ్వాసం వల్ల ఉన్న నమ్మకానికి కూడా బీటలు పడే ప్రమాదం పడింది. వచ్చే ఎన్నికల్లో ఏం చెప్తారు? హోదా ఇవ్వనందుకే అవిశ్వాసం ప్రకటించాం, కేంద్రంతో యుద్ధం చేశాం అని చెప్తారా? అయితే హోదా ఎందుకు రాలేదు అని ప్రజలు అడిగితే.. అప్పుడు సమాధానం కూడా సిద్ధం చేసుకోవాలి. అనుభవం ఉన్నవారు.. నవ్యాంధ్ర నిర్మాణం ఆయనతోనే సాధ్యం అని నమ్మే.. చంద్రబాబుని నమ్మి పట్టం కట్టారు… ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం దశ దాటి ఎన్నికల అంశంగా మారిపోయింది. ఈ సారి ఎన్నికలకు నవ్యాంధ్ర ప్రజలకు కావాల్సింది “హోదాతో కూడిన నవ్యాంధ్రప్రదేశ్“. ఇవ్వగలరా?
About Author
admin
Previous Post
ఆ 6 రోజులు తిరుమలేశుని దర్శనం బంద్…
Next Post
కౌ’గిలిగింత’- అమూల్ కార్టూన్
Recent Posts
- ‘నాన్పకల్ నెరత్తు మయ్యక్కమ్’. మమ్మూట్టీ ఒన్ మ్యాన్ షో
- BBC: చెప్పేవి శ్రీ రంగ నీతులు… మరి చేసేవి? అసలు BBC ఎలా పుట్టిందంటే?
- ‘ఫ్రీ’ హిట్లో ముఖేష్ అంబాని భారీ ‘సిక్స్’ ! ఈ బిజినెస్ గేమ్ ముందు IPL ఎంత?
-
‘We stand up for BBC’
మన సార్వభౌమత్వాన్నే అవమానిస్తున్న బ్రిటన్ - ఇంతకీ MH 370 విమానం ఏమైంది? నెట్ఫ్లిక్స్ సిరీస్లో ఏముంది?
1 Comment
Analysis bagundi. Fine