ఇసుక విషయంలో విశాఖపట్నంలో జనసేన చేసిన లాంగ్మార్చ్ ఎవరు ఏమన్నా సక్సెస్. పవన్ పాత పద్ధతిలోనే మాట్లాడారు. అందులో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్, ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి మాట్లాడతా? అన్న ఆయన మాటల్లో 2014 నాటి జోరు కనిపించింది. ముఖ్యంగా సీఎం జగన్పై విసుర్లు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాజధానిని పులివెందులకు మార్చేసుకోండి అని సీఎంకి స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పార్టీ, అధ్యక్షుడు కూడా గెలవని పార్టీ, రిజల్ట్స్ వచ్చాక ఎవరున్నారో లేరో క్లారిటీ కూడా సరిగ్గా లేని పార్టీ… ఇలా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విసుర్లు వేయడానికి ధైర్యం చేస్తుందా? చేస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకుంటుందా? ఆ ధైర్యం ఎక్కడిది?
ఆయన లాంగ్మార్చ్కి పిలిస్తే విశాఖపట్నంలో వీధులు నిండిపోయేంత జనం వచ్చారు. మరి అంత పవర్ ఎక్కడుంది? రిజల్ట్స్ వచ్చాక చాలా రోజులు పవన్ మౌనంగా ఉన్నారు. హడావిడి ఏమీ లేదు. అసలు పార్టీ ఊసు, న్యూసు రెండు లేవు. మళ్లీ అకస్మాత్తుగా జనసేన టాక్ బాగా వినిపిస్తోంది. మొన్నటి లాంగ్ మార్చ్తో మళ్లీ పవన్ కనిపిస్తున్నారు. ఇది స్టేట్ పాలటిక్సేనా? సెంట్రల్ పాలిటిక్సా? ఇప్పుడు ఈ డౌటే అందరికీ వస్తోంది. అప్పట్లో చంద్రబాబు స్నేహామేరా జీవితం అంటూ మోదీకి చేయి అందించారు. 2014 ఎన్నికల్లో పవన్ కూడా వయా మోదీ చంద్రబాబుకి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత చేజేతులా చంద్రబాబు, పవన్… మోదీ స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు మోదీ ఎవరూ టచ్ చేయలేనంత పవర్ఫుల్. మళ్లీ భంగపడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ స్నేహం కోరుకుంటున్నారా? లేదా బీజేపీనే… ఏపీలో జగన్కి కౌంటర్ వేసే పని పాత మిత్రులకే అప్పచెప్పారా? ఎందుకంటే అక్కడ ఉన్నది పవర్ఫుల్ మోదీ. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన్ను ఎదిరించి నిలబడే నాయకుడే కనిపించడం లేదు మరి. ఆ పవర్తో స్టేట్ పాలిటిక్స్లో ఎలాంటి వ్యూహాలైనా నడిపించగలరు. పక్కన ఎలాగూ మాస్టర్ మైండ్ అమిత్ షా ఉన్నారు.
దేశమంతా కాషాయమే ఉన్నా… సౌత్లో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పట్టు చిక్కడం లేదు. ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్గా ఉండే ఏపీ, తెలంగాణ, తమిళనాడులో బీజేపీ ప్రభావం అంతంతమాత్రమే. కానీ, మోదీ-అమిత్షా లెక్కలు వేరు. మొన్నటికి మొన్న తెలంగాణలో అనూహ్యంగా 4 ఎంపీ సీట్లు కొట్టి…బీజేపీ అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేసింది. బీజేపీకి ఇప్పుడు ఏపీ, తెలంగాణలో బలమైన నాయకులు అవసరం. అందుకు బీజేపీ కూడా ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో ఉంది. మిగిలినవి టీడీపీ, జనసేన పార్టీలు మాత్రమే. ఆ మధ్య చంద్రబాబు.. ఆ నలుగురిని బేజేపీకి పంపినా.. మోడీ ఓకే అన్నారు. ఇది వ్యూహంలో భాగమేనా? ఇప్పుడు పవన్ పార్టీకి గట్టి సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ లేకపోతే పార్టీ నిలబడదన్న సంగతి పవన్కూ తెలుసు. అందుకే మళ్లీ 2014 నాటి స్నేహాస్త్రాన్ని బయటకు తీశారా? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి జగన్పై కౌంటర్లు వేస్తున్నారు. పవన్ ముందుండి లాంగ్మార్చ్లు నడిపిస్తున్నారు. ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే గ్రౌండ్ వర్క్ పక్కా ప్లాన్తో నడుస్తోంది. అటు తెలంగాణలో కూడా ఆర్టీసీ సమ్మెకి కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా… బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. లేకపోతే ఇన్నాళ్ల ఆర్టీసీ సమ్మె చరిత్రలో లేదు. బలమైన బ్యాకప్ లేకుండా ఆర్టీసీ యూనియన్ నేతలు ఈ స్థాయిలో సమ్మెచేయగలరా? ఏపీలో కూడా జగన్తో బీజేపీకి సన్నిహిత సంబంధాలేమీ లేవు. అలాగే కేసీఆర్తో కూడా. ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్ రాజకీయాల అడుగులు వేసినవారే. ఆ విషయం మోదీ మర్చిపోతారా? అదానీ, అంబానీ కంపెనీలు ఏపీ నుంచి వెనుదిరగడం, ఆ వెంటనే చంద్రబాబు కౌంటర్లు, లాంగ్ మార్చ్లు… ఆఖరికి సీఎస్ ఆకస్మిక బదిలీ.. వీటన్నిటి వెనుక ఎక్కడో బీజేపీ తగులుతోంది. మరి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ‘పవర్’ అదేనా….? ఒకవేళ అదే నిజమైతే మళ్లీ జనసేన రీఛార్జ్ అయినట్టే.