శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కాశీ వాసులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ కూడా. 32 నెలలుగా ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. మొత్తాని కాశీ విశ్వనాథ్ ధామ్ని శివుడికి ఇష్టమైన రోజుగా విశ్వసింటే సోమవారం నాడు మోదీ ప్రారంభించారు. కాశీలో విశ్వనాథునికి పూజలు చేసిన తర్వాత మోదీ ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేశారు. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించింది.

32 నెలల పాటు ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ భూమి మీద అతి పురాతనమైన నగరం కాశీ. వేద కాలం నుంచి ఈ నగరం గురించి ఎన్నో కథలు వినిపిస్తూనే ఉన్నాయి. కాశీ విశ్వనాథుడు స్వయంభువుగా వెలిసిన ఈ నగరంలో అడుగడుగునా ఆలయాలే. విశ్వనాథుని ఆలయం పూర్వ రూపం ఎలా ఉండేదో గానీ… 1669లో అహిల్యాబాయి హోల్కర్ కాశీ విశ్వనాథ ఆలయాన్ని పునురుద్ధరించారు. ఆ తర్వాత మళ్లీ కాశీ ఆలయాన్ని విస్తరించాలన్న ప్రాజెక్ట్ ప్రతిపాదనను నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. అంటే 350 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీ విశ్వనాథుని ఆలయానికి కొత్త రూపు రేఖలు వచ్చాయి. 2019 మార్చ్ 8న విశ్వనాథ ఆలయ కారిడార్ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం దాదాపు కారిడార్ పనులు పూర్తయ్యాయి. ఈ కారిడార్ నిర్మాణానికి రూ.340 కోట్లు ఖర్చయ్యాయని అంచనా. 50 వేల స్క్వేర్ మీటర్ల పెద్ద కారిడార్ ఇది. ఈ కారిడార్ ఎంట్రీ గంగానది వైపు ఉన్న లలితా ఘాట్ నుంచి ఉంటుంది. కాశీ విశ్వనాథ కారిడార్ 3 భాగాలుగా ఉంటుంది. వీటిలో మొదటిది ఆలయ ప్రధాన భాగం. ఇందులో 4 పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ప్రదక్షిణ మార్గం కూడా ఉంటుంది. ఇంతకు ముందు ఈ మార్గాలన్ని కాస్త ఇరుగ్గా ఉండేవి. ఈ కొత్త ప్రదక్షిణ మార్గంలో 22 మార్బుల్స్ మీద కాశీ మహత్యాన్ని కథలుగా చెక్కారు.

ఈ కారిడార్లో 24 భవనాలు నిర్మించారు. వీటిలో ప్రధాన ఆలయం ప్రాంగణంతో పాటు… ఆలయం జంక్షన్, ముముక్షు భవన్, టూరిస్ట్ వసతి కేంద్రం, షాపింగ్ కాంప్లెక్స్.. ఇంకా గంగా వ్యూ కెఫే, సిటీ మ్యూజియంలు ఉంటాయి. ఈ ధామ్ని ఓ పర్యాటక ప్రాంతంగా ప్లాన్ చేశారు. ప్రాంగణం చుట్టూ 5 వేలకు పైగా లైటింగ్ అట్రాక్షన్ పెట్టారు. ఈ కారిడార్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దాదాపు 350 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీ విశ్వనాథ్ ఆలయం ప్రాంగణం పునరుద్ధరణ జరిగింది కాబట్టి… కాశీ ప్రజలు ఈ కార్యక్రమాన్ని పండుగలా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కాశీకి ప్రతిష్ట తెచ్చే కార్యక్రమంగా భావిస్తున్నారు.

ఈ కారిడార్ లేనప్పుడు ఆలయ శిఖర దర్శనం ఇబ్బందిగా ఉండేది. మహిళలు, వృద్ధులు ఆలయానికి వచ్చేందుకు మార్గం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆలయ దర్శనానికి విశాలమైన ప్రాంగణం అందుబాటులోకి వచ్చింది. భక్తులకు ఇప్పుడు కాశీ విశ్వనాథుడు సులభుడే. కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం సుమారు 400 ఇళ్లు, వందల ఆలయాలను సేకరించారు. విశ్వనాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో జనాభా చాలా ఎక్కువ. ఆ ప్రాంతంలో 400 ఆస్తులను ఈ కారిడార్ కోసం కొన్నారు. రెండున్నర ఏళ్ల పాటు నిర్మాణం జరిగిన ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టు దాదాపు పూర్తైంది. ఈ కారిడార్ నిర్మాణంలో 2600 మంది కార్మికులు, 300 మంది ఇంజనీర్లు పనిచేశారు. ఈ కారిడార్ కోసం సేకరించిన 400 ఆస్తుల్లో 27 కాశీ ఖండోక్త్ ఆలయాలు, 127 ఇతర ఆలయాలు ఉన్నాయి. వీటిని కూడా ప్రభుత్వం సంరక్షిస్తోంది. కాశీ ఖండోక్త్ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఆ కాలంలో ఉన్నట్టే ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఇకపై కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్టుతో వారణాసికి కొత్త కళ వచ్చింది.