” ఇదిగో నా ఆధార్ నంబర్. ఈ నంబర్తో నాకు ఏం హాని జరుగుతుందో చూస్తా” ఆదివారం ట్విటర్లో తన ఆధార్ నంబర్ను పబ్లిక్గా పోస్ట్ చేసి సవాల్ చేశారు… ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ. ఎథికల్ హాకర్లు, టెక్కీలు ఆయన ఫోన్ నంబర్, ఓటర్ ఐడీ, అడ్రస్, పాన్ నంబర్, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ అకౌంట్లు అన్నీ పోస్ట్ చేశారు. ఒక్క ఆధార్ నంబర్ తెలిస్తే ఇన్ని వివరాలు తెలిసిపోతాయా? అని సామాన్యుల్లో అనుమానాలు కలగొచ్చు. అవును తెలిసిపోతాయి. అయితే ‘ ఈ వివరాలు తెలిస్తే మాత్రం ఏం లాభం. నాకేం హాని జరగలేదుగా‘ అంటున్నారు శర్మ. ఇది సరైన వాదన కాదు. ప్రైవసీ అనే మాటకున్న నిర్వచనం వేరు. సాంకేతికంగా ఎన్నో మెట్లు ఎక్కి, ఎంతో అనుభవమున్న శర్మ లాంటి వారు గోప్యతకి ‘హాని జరగలేదుగా‘ అనే కొత్త మీనింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బహుశా మన దేశంలో టాప్ టెక్నోక్రాట్స్ ‘ వ్యక్తిగత గోప్యత‘ అనే అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు లేరు. ప్రతీ వ్యక్తికి వ్యక్తిగత వివరాల గోప్యత ఎందుకు అవసరమో UIDAI, TRAI ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఎథికల్ హ్యాకర్లు కాబట్టి ఆయన వివరాలతో ఆటలాడలేదు. ఆధార్ నంబర్తో అన్ని వివరాలు తెలుసుకునే లొసుగులు ఉన్నాయన్న విషయాన్ని బయటపెట్టారు. ఇది మంచిదేగా… టెక్నికల్గా లోపాలు సవరించుకునేందుకు ఇదో అవకాశం. అదే దొంగల చేతుల్లో ఇవే వివరాలు పడితే…? ఒక్క ఫోన్ నంబర్తో అకౌంట్లు ఖాళీ చేయగల హ్యాకర్లున్నారు. అకౌంట్ నంబర్ తెలిస్తే డబ్బు మాయం చేసే కేటుగాళ్లున్నారు. ‘వివరాలు తెలిసినా హాని లేదు‘ అంటున్నారంటే ఆయన టెక్నాలజీ అప్డేట్ అవుతున్నారా లేదా అని అనుమానించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆధార్ నంబర్ను పబ్లిక్గా బహిర్గతం చేయకూడదని UIDAIనే చెప్తోంది. ఆ నిబంధనని శర్మే ఉల్లంఘిస్తే ఎలా? “ నా వివరాలు తెలుసుకుని ఏం చేస్తారు..? తెలుసుకుని హాని చేయగలరా?” అంటారు శర్మ. ఇది చాలా సిల్లీగా ఉంది. ఆయనకు హాని లేదేమో… ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్, అకౌంట్ నంబర్… ఇవి ఖచ్చితంగా అవసరం లేని చోట బయటపడకూడని.. వ్యక్తిగత అంశాలు. ఆయన వివరాలు వెబ్సైట్లో కూడా ఉంటాయి. ఉండాలి కూడా. కానీ, ఓ మహిళ లేదా విద్యార్థినికి సంబంధించిన ఇవే వివరాలు బయటపడితే అప్పుడు కూడా ఫర్వాలేదంటారా?ఆ ఫోన్ నంబర్ పట్టుకుని ఆమెను వేధిస్తే, బెదిరిస్తే. ఒక మహిళ ఫోన్ నంబర్ ఖచ్చితంగా గోప్యంగా ఉండాల్సిన అంశం. అలాగే ఇంటి అడ్రస్ కూడా. ఇదీ మరీ ప్రమాదకరం. మహిళల విషయంలోనే కాదు… ఏ పౌరుడైనా తన వ్యక్తిగత వివరాలు గోప్యంగానే ఉండాలనుకుంటాడు. నూటికి 90 శాతం ఏం జరగకపోవచ్చు.. అంటే 10 శాతం జరిగినా ఫర్వాలేదనా?
బ్యాంకు కాల్ సెంటర్లకు ఫోన్ చేస్తే.. వినియోగదారుడిని నిర్ధారణ చేసుకోడానికి.. ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి అడ్రస్.. ఇవే అడుగుతారు. వీటికి తోడు అకౌంట్ నంబర్ తెలిస్తే అంతే సంగతులు. అవి కరెక్ట్గా చెప్తే… ఏదైనా సాధ్యమే. మన ఈమెయిల్కి పీడీఎఫ్ల ద్వారా పంపించే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ డీఫాల్ట్ పాస్వర్డ్ దాదాపుగా పుట్టిన తేదీనే ఉంటుంది. హానికి ఇంత అవకాశం ఉండీ…. “హాని లేదు” అనడం పెద్ద బ్లండర్. ఇప్పుడు మనం డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. ప్రతీ నిమిషం మనకు సంబంధించిన సమాచారం తెలిసో, తెలియకో షేర్ అయిపోతోంది. క్రెడిట్ కార్డు కావాలా? మా బ్యాంకులో అకౌంట్ తీసుకోండి… మీకు తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తాం.. ఇలాంటి కాల్స్ మీ ఫోన్కి వస్తుంటాయి. వాళ్లందరికీ మీ ఫోన్ నంబర్ ఎక్కడిది..? డిజిటల్ ప్రపంచంలో ‘ప్రైవసీ‘ పెద్ద భ్రమే. ేవేలి ముద్రలు కూడా సురక్షితం కాదని.. లేటెస్ట్ టెక్నాలజీ ఋజువు చేసింది. ఆధార్ను తప్పు పట్టడం లేదు. బట్, పౌరుల వ్యక్తిగత సమాచారం ఒక్క అక్షరం కూడా బయటకు పొక్కని విధంగా టెక్నాలజీని రూపొందించండి.
ఆధార్ను అద్భుతంగా తీసుకెళ్లాలన్న ఉద్దేశం ఉంటే.. ముందు సీడింగ్ సెంటర్లు పెంచండి. ఇప్పటికీ సీడింగ్ సెంటర్లలో గంటలకు గంటలు పడిగాపులు పడుతున్నారు. చిన్న చిన్న పిల్లలతో వచ్చేవాళ్లకు కొన్ని చోట్ల మంచి నీళ్లు కూడా ఉండవు. పాపం వాళ్లు ఏడుపులు. పసిపిల్లల ఆధార్లకు ప్రత్యేక సెంటర్లే లేవు కదండి. వీటికి తోడు పదే పదే సర్వర్లు డౌన్ అనే సమాధానం వస్తుంది. ఈ కాలంలో కూడా సర్వర్ డౌనా.. హవ్వ… సమాధానం వినడానికి కూడా బాగోలేదు. ప్రతీ వీధిలో.. ఎస్టీడీ బూత్ తరహాలో ఆధార్ సీడింగ్ సెంటర్లు పెట్టండి. ఎందుకంటే ఆధార్ మస్ట్ అంటున్నారు కాబట్టి. లేదా… పోర్టబుల్ ఆధార్ సీడింగ్ మెషీన్లు తీసుకుని ఒక్కో రోజు ఒక్కో వీధిలో ఆధార్ సీడింగ్ చేయండి. పోలియో డ్రాప్స్ వేసినప్పుడు స్కూళ్లలో పెడతారే అలా ప్రతీ ఆదివారం బడుల్లో ఆధార్ మెషీన్లు తెచ్చుకుని సీడింగ్ చేయండి. ఇంకా ఆ టెక్నాలజీకి అప్డేట్ కాలేదా? మేమెందుకు ఆ బ్యాంకుల్లో, ఈ సేవల్లో వెయిట్ చేయాలి? ఆధార్ కంపల్సరీ అని ప్రభుత్వం డిసైడ్ అయినప్పుడు.. ఇంటింటికీ తిరిగి ఆధార్ నమోదు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.. కాదంటారా? మీరు చెయ్యాల్సినవి ఇవి. పనికొచ్చే ఈ విషయాలన్నీ వదిలేసి… ట్విట్టర్లో ఈ అర్థం పర్థం లేని గోలేంటి సార్.