June 3, 2023

బెట్టింగ్‌-గ్యాంబ్లింగ్‌ చట్టబద్ధం చేయాలి, ట్యాక్స్‌ పరిథిలోకి తీసుకురావాలి : లా కమిషన్‌ సిఫార్సులు

బెట్టింగ్‌-గ్యాంబ్లింగ్‌ చట్టబద్ధం చేయాలి, ట్యాక్స్‌ పరిథిలోకి తీసుకురావాలి : లా కమిషన్‌ సిఫార్సులు

మైదానంలో క్రికెట్ ఉత్కంఠగా సాగుతుంటేమైదానం బయట అంతకంటే ఉత్కంఠగా బెట్టింగ్ బేరసారాలు జరిగిపోతుంటాయి. కోట్ల రూపాయల ధనం చేతులు మారిపోతుంటాయి. బెట్టింగ్‌ని నియంత్రించాలంటే దొంగ చేతికి తాళాలిస్తే సరి. అవే అడుగులు పడబోతున్నాయా? క్రికెట్‌ సహా ఆటలపై సాగే బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలని లా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తావించింది. లా కమిషన్‌ ఏం చెప్తోందంటే బెట్టింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధిస్తే వ్యతిరేక ఫలితాలు రావొచ్చు. నిషేధం వల్ల గుట్టుచప్పుడు కాకుండా నల్లధనం చేతులు మారిపోతోంది. ఇది ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల బెట్టింగ్‌ని లీగలైజ్‌ చేసి ట్రాన్సాక్షన్‌ అన్ని పాన్‌, ఆధార్‌ లింక్‌తో ఆన్‌లైన్‌లోనే జరగాలని చట్టం చేస్తే నల్లధన ప్రవాహాన్ని నిరోధించవచ్చు. చట్టబద్ధం చేసినప్పటికీ వంద శాతం ఫలితాలు వస్తాయని చెప్పలేం. కాకపోతే అక్రమ లావాదేవీలు చాలా వరకు తగ్గుతాయి. బెట్టింగ్‌లో సంపాదించిన డబ్బు ట్యాక్స్‌ పరిథిలోకే వస్తుంది. ” ఇదీ లా కమిషన్‌ సిఫార్సులో ప్రధాన అంశాలు. ఈ సిఫార్సులకు ముందు విద్యార్థులు, నిపుణులు, ప్రజల అభిప్రాయాలను తీసుకున్న లా కమిషన్‌నిరోధించడం కన్నా నియంత్రించడమే మేలన్న భావనకు వచ్చింది. ప్రస్తుతం గుర్రపు పందేలకు మాత్రమే లీగల్‌ బెట్టింగ్‌ ఉంది. ఆ బెట్టింగులపై జీఎస్టీతో కలిపి 28 శాతం పన్ను కూడా వసూలు చేస్తున్నారు. గుర్రపు పందేలను గేమ్‌ ఆఫ్‌ స్కిల్‌గా పరిగణించినప్పుడు మిగిలిన ఆటలకు కూడా అదే పద్ధతి వర్తింప చేయొచ్చునని లా కమిషన్‌ తన సిఫార్సుల్లో చెప్పింది. వీటితో పాటు కేసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలకు ఫారెక్స్‌, ఎఫ్‌డీఐ పెట్టుబడులను అనుమతించే విధంగా చట్టాలను సవరించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది. అలా చేస్తే బెట్టింగ్‌లు అదుపులో ఉంటాయని, నిధుల ప్రవాహంపై నిఘా ఉంటుందని వివరించింది. అయితే ఇలాంటివి భారత్‌ పరిథిలో అనుమతి పొందిన వారే నిర్వహించాల్సి ఉంటుందని కూడా వెల్లడించింది. వారికిచ్చే ప్రత్యేక క్యాప్ నంబర్‌ ద్వారానే నిర్వాహకులు నగదు లావాదేవీలు నడపాలని, నిర్వాహకులు తమ అకౌంట్లకు ఖచ్చితంగా పాన్‌, ఆధార్‌ వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని, లావాదేవీలన్నీ కేవలం నగదు రహితంగానే జరగాలని కూడా సిఫార్సుల్లో తెలిపింది. బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలన్న అంశం చాన్నాళ్లుగా నలుగుతోంది. ఓ రిపోర్ట్‌ ప్రకారం భారత్‌లో జరిగే బెట్టింగ్‌ల విలువ సుమారు 60 బిలియన్లు. అంటే సుమారు 3 లక్షల 60 వేల కోట్లు. తాజా సర్వేల ప్రకారం ఇది ఇంకా ఎక్కవేనట! దోహాలో ఉన్న ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్‌ సెక్యూరిటీ రిపోర్ట్‌ ప్రకారం భారత్‌లో అక్రమ బెట్టింగ్‌ లావాదేవీల విలువ 9.5 లక్షల కోట్లు. ఈ డబ్బంతా లెక్కలోకి రాని నల్లధనం. స్థానిక బుకీలు, వెబ్‌సైట్ల ద్వారా ఈ వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్నాయి. చాపకింద నీరులా సాగిపోతున్న ఈ నల్ల ఆటను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అందుకే స్పోర్ట్‌ బెట్టింగ్‌ని లీగలైజ్‌ చేస్తే.. వేల కోట్ల నగదు టాక్స్‌ రూపంలో సమకూరుతుంది. కేసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లను కూడా లీగలైజ్‌ చేస్తే ఈ ట్యాక్సుల విలువ రెట్టింపే. భారీ వడ్డీలకు అప్పు చేసి మరీ ఆడడం చట్ట విరుద్ధ గ్యాంబ్లింగ్‌లోఅతి పెద్ద సమస్య. దీని వల్ల ఎందరో నష్టపోతున్నారు, చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లా కమిషన్‌ వెల్లడించింది. చాలా దేశాల్లో స్పోర్ట్‌ బెట్టింగ్‌ చట్టబద్ధం. ఈ విషయంపై స్పందనలు ఎలా వస్తాయో చూడాలి.

About Author

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *